భద్రాద్రి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు ఊపిరి
కేంద్రమంత్రి రామ్మోహన్ను కలిసిన మంత్రి తుమ్మల
1 / 2
న్యూఢిల్లీ,జూన్ 23:దశాబ్దాలుగా భద్రాద్రి జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ప్రతిపాదించిన స్థలం సాంకేతిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన ప్రభుత్వం, అక్కడ సాధ్యాసాధ్యాల పరిశీలనను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడిని కలిసి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు.
కొత్తగూడెం సమీపంలో ప్రతిపాదించిన తొలి స్థలంలో ఒకవైపు విద్యుదీకృత రైల్వే మార్గం, మరోవైపు కొండలు అత్యంత సమీపంలో ఉండటం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి అనుకూల పరిస్థితులు లేవని గతంలో నిర్వహించిన ఫీజిబిలిటీ అధ్యయనంలో తేలినట్లు మంత్రి తుమ్మల వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో స్థలాన్ని ఎంపిక చేసి, దానిపై సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధం చేసేందుకు ప్రత్యేక ఏవియేషన్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. నివేదిక త్వరలో అందనున్న నేపథ్యంలో కొత్త స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులను వెంటనే పంపించాలని రాంమోహన్ నాయుడిని కోరారు.
మూడోసారి ప్రతిపాదన.. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం...
గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం ఇప్పటివరకు ప్రతిపాదించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురవడంతో, మూడో ప్రతిపాదిత స్థలాన్ని ప్రత్యామ్నాయంగా కేంద్రం ముందు ఉంచినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త స్థలంపై ఫీజిబిలిటీ నివేదికను 10 రోజుల్లోనే అందించాలని కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు తన అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన చర్యలను వెంటనే చేపట్టాలని కూడా స్పష్టం చేశారు.
మామునూరు ఎయిర్పోర్టుకు వచ్చే నెల తొలి వారంలో శంకుస్థాపన...
వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయానికి వచ్చే నెల తొలి వారంలోనే శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు ఈ సందర్భంగా మంత్రి తుమ్మలకు వివరించారు.
భద్రాద్రి భక్తులకు వరం...
దక్షిణ అయోధ్యగా ఖ్యాతి పొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోందని తుమ్మల పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు కల్పించాలంటే విమానాశ్రయం అవసరం ఎంతో ఉందన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే భద్రాద్రి యాత్ర మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు.
పారిశ్రామిక, విద్యా రంగాలకు కొత్త ఊపు...
సింగరేణి బొగ్గుగనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, బీపీఎల్ వంటి ప్రముఖ పరిశ్రమలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పటికే పారిశ్రామికంగా ప్రత్యేక గుర్తింపు సాధించిందని తుమ్మల తెలిపారు. సమృద్ధిగా ఉన్న అటవీ సంపద, అరుదైన ఖనిజ నిక్షేపాలు, ఎకో టూరిజం అవకాశాలతో పాటు దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు కావడం జిల్లాకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చిందన్నారు. ఇలాంటి నేపథ్యంలో విమానాశ్రయం ఏర్పడితే పారిశ్రామిక పెట్టుబడులు పెరగడమే కాకుండా విద్యా, పర్యాటక రంగాలు గణనీయంగా పురోగమించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పన సహా అన్ని అంశాల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటే కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కల త్వరలోనే వాస్తవరూపం దాల్చుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.