విశ్వవేదికపై సింగరేణి సత్తా..
అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ స్థానం.. తెలంగాణకు గర్వకారణం
హైదరాబాద్,జూన్ 7: ప్రపంచ గనుల రంగంలో సింగరేణి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. జాంబియా దేశంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి రెస్క్యూ జట్టు ప్రథమ బహుమతి సాధించి విశ్వవేదికపై తెలంగాణ కీర్తిని రెపరెపలాడించింది. భూగర్భ గనుల రక్షణ విభాగంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లను వెనక్కినెట్టి విజేతగా నిలవడం విశేషం.
ఈ విజయాన్ని సాధించిన సింగరేణి రెస్క్యూ జట్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం అభినందించారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో సింగరేణి సీఎండీ ఎన్. బలరాం (జ్యోతి బుద్ధ ప్రకాష్)తో కలిసి రెస్క్యూ బృందం ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా వారు గెలుచుకున్న ట్రోఫీలు, పతకాలను భట్టి విక్రమార్కకు అందజేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూగర్భ గనుల రక్షణలో సింగరేణి ఎప్పుడూ అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో చైనా, కెనడా, ఆస్ట్రేలియా, పోలాండ్, కొలంబియా వంటి గనుల రంగంలో పేరొందిన దేశాల జట్లతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం తెలంగాణతో పాటు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు.
గనుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు రెస్క్యూ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తారని కొనియాడారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సింగరేణి రెస్క్యూ బృందం నైపుణ్యాన్ని ఈ విజయం ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందన్నారు.
సింగరేణిని కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలపై సింగరేణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (పర్సనల్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు, జీఎం (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టి. శ్రీనివాస్, రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి, రెస్క్యూ జట్టు సభ్యులు, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రపంచ స్థాయిలో మరో మైలురాయి
గనుల భద్రత, రక్షణ కార్యకలాపాల్లో సింగరేణి జట్టు ప్రదర్శించిన ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మరో మైలురాయిగా నిలిచింది. ప్రపంచ దేశాల మధ్య జరిగిన పోటీలో ప్రథమ స్థానం సాధించడం ద్వారా సింగరేణి సంస్థ సాంకేతిక నైపుణ్యం, శిక్షణా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.