*3 కొత్త పీహెచ్సీలు మంజూరు చేయండి*
అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి
•"పీహెచ్సీలే అత్యవసర ప్రాణరక్షక కేంద్రాలు"
•అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే ఏలూరి గళం
•వలపర్ల, పెద్దగంజాం, మోటుపల్లిలలో నూతన పీహెచ్సీల ఏర్పాటుకు విజ్ఞప్తి
•మంత్రికి గతంలోనే లేఖ ద్వారా విన్నపం...
•తాజాగా సభలో మరోమారు కోరిన ఎమ్మెల్యే
•రాష్ట్ర వ్యాప్తంగా 140కి పైగా కేంద్రాల ఆవశ్యకత... శిథిలావస్థలో పాత భవనాలు
•ఉన్న పీహెచ్సీలకూ మెరుగైన పరికరాలు, వైటల్స్ కల్పించండి
పర్చూరు:
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు క్షణాల్లో చికిత్స అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే (పీహెచ్సీలు) నిజమైన అత్యవసర ప్రాణరక్షక వ్యవస్థలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అసెంబ్లీలో అభిప్రాయపడ్డారు. సకాలంలో ప్రథమ చికిత్స అందితేనే ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోగలమని, అందుకు గ్రామస్థాయిలో పీహెచ్సీల లభ్యత అత్యంత కీలకమని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు.
నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేయాలన్న లక్ష్యంతో వలపర్ల, పెద్దగంజాం, మోటుపల్లి గ్రామాల్లో కొత్తగా మూడు పీహెచ్సీలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై గతంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాసినట్లు గుర్తుచేస్తూ, తాజాగా అసెంబ్లీ వేదికగా మరోమారు విజ్ఞప్తి చేశారు.
*సీహెచ్సీలు సుదూరం...ప్రజలకు నిత్య ఇక్కట్లు*
జనసాంద్రత అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీలు) చాలా దూరంగా ఉండటంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఏలూరి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉంటే సకాలంలో చికిత్స అందించి ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
*140కి పైగా కేంద్రాల ఆవశ్యకత...శిథిలావస్థలో పాత భవనాలు*
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 140 కొత్త పీహెచ్సీలు అవసరమని ఇప్పటికే గుర్తించినట్లు, వాస్తవ సంఖ్య ఇంకా అధికంగానే ఉండే అవకాశం ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన పీహెచ్సీ భవనాలు కనీస సదుపాయాలు లేక, పెచ్చులూడిపోతూ శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభ దృష్టికి తెచ్చారు.
*ప్రాథమిక వైద్య పరికరాల కొరతపైనా దృష్టి*
ఇప్పటికే ఉన్న పీహెచ్సీలకు మరింత మెరుగైన వైద్య పరికరాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. రోగుల ప్రాథమిక ఆరోగ్య పరిస్థితిని (వైటల్స్) నమోదు చేసేందుకు అవసరమైన కనీస వైద్య పరికరాలను పీహెచ్సీలకు సమకూర్చాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని మంత్రిని ఎమ్మెల్యే ఏలూరి కోరారు.