సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్ కీలకం
సీఎం చంద్రబాబు
1 / 2
కుప్పం:సంజీవని కార్యక్రమంలో డేటా అనుసంధానమే అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజు కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ నుంచి ఆస్పత్రి పరిశుభ్రత వరకు ప్రతి అంశంపైనా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
డిజిటలైజేషన్తోపాటు డేటా అనుసంధానం అవసరం
సీటీ స్కాన్ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా రోజుకు ఎంతమందికి సేవలు అందించగలరని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. రోజుకు 30-40 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఆస్పత్రి ఆవరణలో కొంతమేర చెత్త కనిపించడాన్ని గమనించిన సీఎం, వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజలు సంతృప్తి చెందాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడంతోపాటు ప్రతి అంశంలోనూ డేటా ఇంటిగ్రేషన్ చేపట్టాలని సూచించారు. డయాలసిస్ వార్డు సందర్శన సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు డయాలసిస్ కోసం కుప్పం ఆస్పత్రికి వస్తున్నారని అధికారులు వెల్లడించగా, కుప్పంలో ప్రజలకు సంజీవని ద్వారా ఏమేరకు మేలు కలిగిందో వివరాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
గంజాయి నియంత్రణపై కఠిన వైఖరి
పంచతత్వ కాన్సెప్టుతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ను పరిశీలించిన ముఖ్యమంత్రి అక్కడ మొక్క నాటారు. వైద్యారోగ్య రంగంలోని వివిధ ఆవిష్కరణలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించి, రోడ్డు ప్రమాదాల సమయంలో వైద్యులకు తక్షణ సమాచారం అందించే పరికరాన్ని రూపొందించిన విద్యార్థినిని అభినందించారు. గంజాయి, డ్రగ్స్ బారినపడ్డ వారికి మెడిటేషన్ ద్వారా ఆరోగ్యం మెరుగయ్యేలా సహకారం అందిస్తున్నట్టు బ్రహ్మకుమారీలు వివరించగా, డ్రగ్స్, గంజాయి నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం కుప్పం నగరంలో ఏర్పాటు చేసిన స్వర్ణ కుప్పం-స్వచ్ఛ కుప్పం స్వాగత ఆర్చ్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.