డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం
'ఈగల్' పోరాటం
1 / 3
విజయవాడ:రాష్ట్రంలో 13 నుంచి 18 ఏళ్ల యువత గంజాయి, మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా 3.5–4 కోట్ల మంది ఈ వ్యసనానికి బానిసలైనట్లు అంచనా. వీరిలో 60–70 శాతం మంది కేవలం స్నేహితుల ఒత్తిడితోనే ఈ మార్గం పట్టినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' కింద ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
"స్నేహితుల ముసుగులో శత్రువులు"
ముఖ్య అతిథిగా పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, యువశక్తే దేశానికి అతిపెద్ద పెట్టుబడి అని, చిన్న అవగాహన లోపం వల్ల పిల్లలు డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యసనం అలవాటు చేసే స్నేహితులు శత్రువులతో సమానమని, ఒక్కసారి బానిసైతే జైలు తప్పదని హెచ్చరించారు.
'జీరో కల్టివేషన్' దిశగా ఈగల్ టాస్క్ఫోర్స్
450 మంది సిబ్బందితో ఏర్పాటైన 'ఈగల్' టాస్క్ఫోర్స్ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి 'జీరో కల్టివేషన్' సాధించినట్లు మంత్రి అనిత తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం రవాణా, నిల్వ, వాడకానికి కనీసం ఆరు నెలల జైలు తప్పదని హెచ్చరించారు. డ్రగ్స్ సమాచారం కోసం 1972 నెంబర్కు ఫోన్ చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
తగ్గుతున్న వ్యసన వయసు
మహిళాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎ. సూర్యకుమారి మాట్లాడుతూ, గతంలో 25 ఏళ్ల వయసులో వ్యసనానికి బానిసలయ్యేవారు ఇప్పుడు 18–20 ఏళ్లకే చిక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వాలంటే 112కు కాల్ చేయవచ్చని, విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ ప్రతిజ్ఞలో పాల్గొనాలని కోరారు.
'ఆపరేషన్ గరుడ', 'వజ్రాయుధం'తో మాఫియాపై ఉక్కుపాదం
20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, ఏఎస్ఆర్ జిల్లాలో 28 వేల హెక్టార్లలో గంజాయి సాగును నియంత్రించామని, 'ఆపరేషన్ గరుడ', 'ఈగల్', 'వజ్రాయుధం' పేరిట 1.93 లక్షల తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈగల్ వింగ్ ఎస్పీ కె. నగేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో 40 వేలకుపైగా 'ఈగల్ క్లబ్స్' పనిచేస్తున్నాయని, పెడ్లింగ్ చేసేవారు రాష్ట్రం విడిచి వెళ్లాలని హెచ్చరించారు.
NAPDD రాష్ట్ర సమన్వయ అధికారి ఉమారాణి మాట్లాడుతూ, యువతలో మాదకద్రవ్య వ్యసనం సరిహద్దు ఉగ్రవాదం కంటే పెద్ద ముప్పుగా మారిందని, ఇది సామాజిక సమస్యగా అందరూ స్పందించాలని కోరారు.
ముగింపులో ప్రతిజ్ఞ
కార్యక్రమం చివర్లో దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి అనిత "సే నో టు డ్రగ్స్" అని, కలెక్టర్ డా. జి. లక్ష్మీశా "డ్రగ్స్ వద్దు బ్రో" అని సంతకాలు చేస్తూ సిగ్నేచర్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు.