ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణకు
సీఎం చంద్రబాబు పిలుపు
అమరావతి, జూన్ 28: జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా పిల్లలను ఎత్తుకుని ముద్దుచేస్తూ, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్ వివరాలను ఆరా తీశారు. నిర్ణీత సమయానికి అన్ని టీకాలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పల్స్ పోలియో అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలు సుమారు 49.20 లక్షల మందికి పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత వహించాలి: సీఎం
ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. ఉద్యోగాలు, ఉపాధికి వెళుతున్న మహిళలు పిల్లల పెంపకాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. పిల్లల్ని కనడం, పెంచడం వంటి బాధ్యతలు తల్లికే పరిమితం చేయరాదని, ఇంట్లో భర్తలు, పురుషులు కూడా ఆ బాధ్యతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పిల్లల పెంపకంలో ఇంటిల్లిపాదీ భాగస్వాములయ్యేవారని, పిల్లలకు విలువలు నేర్పడంలో అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర పెద్దలు కీలక పాత్ర పోషించేవారని చంద్రబాబు గుర్తుచేశారు. అలాంటి బలమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ తిరిగి రావాలని ఆకాంక్షించారు.
సంతానం భారం కాదు, సంపద: సీఎం
పిల్లలను భారంగా, సమస్యగా చూసే ధృక్పథం మారాలని, సంతానమే సంపద అనే అవగాహన సమాజంలో పెరుగుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ఇందుకోసం ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.