వారసత్వం కాదు.. జవసత్వాలు కావాలి:
వెంకయ్యనాయుడు
1 / 2
విజయవాడ:రాజకీయాల్లో సిద్ధాంతం తగ్గి రాద్ధాంతం పెరిగిపోయిందని former ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ఒక పుస్తక పరిచయ సభలో ఆయన మాట్లాడుతూ, తనకు చిన్నతనంలోనే తల్లి చనిపోయారని, ఆర్ఎస్ఎస్లో చేరిక తనకు ఎన్నో విషయాలు నేర్పిందని గుర్తు చేసుకున్నారు.
ఇటీవల కొంతమంది ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అలా డిమాండ్ చేసే వారినే ముందుగా నిషేధించాలని వ్యాఖ్యానించారు. తుపాకీ కన్నా బ్యాలెట్ ఎంతో శక్తివంతమైనదని, ఇందిరాగాంధీ, వాజ్పాయి, ఎన్టీఆర్ వంటి దిగ్దంతులే ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. నక్సలైట్లు తప్పుదోవ పట్టి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, అభివృద్ధికి అడ్డుపడటంతో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని, ఆయుధాలతో బెదిరించి ఎవరినీ లొంగదీసుకోలేరని స్పష్టం చేశారు.
అసెంబ్లీ, పార్లమెంట్లో కొందరు నేతలు బూతు మాటలు మాత్రమే మాట్లాడుతున్నారని, అలాంటి వారిని ఏం చేయమంటారని తనను అడిగితే.. బూత్లలోకి వెళ్లి బటన్ నొక్కమని చెప్పానని వెంకయ్యనాయుడు తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో ఇలా బూతులు మాట్లాడిన వారెవరూ గెలవలేదని, వారి పేర్లు ప్రస్తావించనని, వారి గురించి అందరికీ తెలుసని పేర్కొన్నారు.
వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని, వారసత్వం కాదు జవసత్వాలు కావాలన్నదే తన సిద్ధాంతమని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. వారసులుగా వచ్చేవారు కింది నుంచి కష్టపడి ఎదగాలని, హెలికాప్టర్లో పైనుంచి కిందికి దింపడం సరికాదని తెలిపారు. అందుకే తన పిల్లలను రాజకీయాల్లోకి ప్రోత్సహించలేదని, అయినప్పటికీ తన కుమారుడు, కుమార్తె సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.
తనకు 77 ఏళ్లు వచ్చినా, పదవీ విరమణ చేశానే కానీ పెదవీ విరమణ చేయలేదని, భవిష్యత్ తరాలకు ఎన్నో విషయాలు తెలియజేయాలనే ఇలాంటి సభలకు హాజరవుతున్నానని పేర్కొన్నారు. ఉషాపతి అయ్యానని, ఉప రాష్ట్రపతి అయ్యానని, ఇక ఏ పతి కావాలని తనకు లేదని, రాజ్యాంగ పదవుల్లోకి వెళ్లే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. రాజ్యసభలో సరైన బలం లేనందున ఉప రాష్ట్రపతిగా వెళ్లాలని ప్రధాని స్వయంగా తనతో చెప్పారని వెల్లడించారు. రాజ్యసభలో ఆర్టికల్ 370పై చర్చ సందర్భంగా గొడవ జరగకుండా చర్చ సాగేలా తాను వ్యవహరించానని తెలిపారు.
శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ఆర్టికల్ 370ను రద్దు చేసి, పార్లమెంట్లో, కశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం చేసి అమల్లోకి తీసుకొచ్చామని, చిన్ననాటి నుంచి తాను కన్న కల ఈ రూపంలో నెరవేరిందని వెంకయ్యనాయుడు భావోద్వేగంగా పేర్కొన్నారు.