నేర రాజకీయాలను ఉపేక్షించం
మంత్రి గొట్టిపాటి
అమరావతి,జూన్ 28: అమరావతిలో శనివారం జరిగిన ప్రజా తిరుగుబాటుతో వైసీపీ అల్లరి మూకలు తోక ముడిచాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కుట్రల ముసుగులో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను అమరావతి మహిళలు, రైతులు గట్టిగా నిలదీసి తిప్పి కొట్టినట్లు ఆయన తెలిపారు.
రాజకీయాల పేరుతో నేరాలకు పాల్పడే వారిని ఏ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఉపేక్షించబోదని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అదే స్పష్టతతో ఉన్నారని, శనివారం అమరావతిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడా గుప్పెడు మట్టి కూడా పోయలేదని మంత్రి విమర్శించారు. విధ్వంసకర విధానాలతో అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధినే వైసీపీ దెబ్బతీసిందని ఆరోపించారు.
అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నాయకత్వం ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కొత్త కొత్త నాటకాలకు తెరలేపుతోందని, ఏ అంశం పైనా స్థిరమైన వైఖరి లేకుండా ప్రజలను మభ్యపెట్టడమే ఆ పార్టీ లక్ష్యంగా మారిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఇదే ధోరణి కొనసాగితే రాష్ట్ర ప్రజల్లో వైసీపీపై మిగిలిన విశ్వాసం కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
అమరావతిలో మహిళలు, రైతులు వ్యక్తం చేసిన నిరసన ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అభివృద్ధి, శాంతి భద్రతలను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని అల్లర్లు సృష్టించే ప్రయత్నాలను ఎంతమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.