ఎవరు అడ్డువచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు
సీఎం రేవంత్రెడ్డి
నల్గొండ:పదేళ్లు అధికారం అనుభవించి రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని, మళ్లీ వారికి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా లేరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నాగార్జున కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో పేదల ఇళ్ల గురించి ఆలోచించకుండా నేతలు ఫామ్హౌస్లు కట్టుకున్నారని, తమ ప్రభుత్వం ఏటా రూ.16వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ, 30 నెలల్లో రైతుల ఖాతాల్లో రూ.1.56 లక్షల కోట్లు జమ, 70వేల ఉద్యోగాల భర్తీ, దేశంలో తొలిసారిగా కులగణన వంటివి చేపట్టామని తెలిపారు.
బీఆర్ఎస్ చెప్పుకొనే త్యాగం అంటే ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ మాత్రమేనని ఎద్దేవా చేసిన సీఎం, నిజమైన త్యాగాలు చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రాణార్పణ చేసిన శ్రీకాంతాచారి వంటివారని కొనియాడారు. తెలంగాణలో వందేళ్ల విధ్వంసం చేసింది కల్వకుంట్ల కుటుంబమేనని, కేటీఆర్, హరీశ్రావులు తోడేళ్లలా తిరుగుతున్నారని ఆరోపించారు.
మూసీ కాలుష్యంపై మాట్లాడుతూ, ఎవరు అడ్డుపడినా ప్రక్షాళన ఆగదని స్పష్టం చేశారు. ఫాంహౌస్లలో మెషిన్లు పెట్టుకుని ఫోన్ సంభాషణలు దొంగచాటుగా విన్నారని కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని, ఎస్ఎల్బీసీని కేసీఆర్ పదేళ్లు నిర్లక్ష్యం చేశారని, వచ్చే ఎన్నికలలోపు ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో ఒక్క మహిళకూ చోటు ఇవ్వలేదని విమర్శిస్తూ, ప్రజాపాలనకు నాలుగు కోట్ల మంది ఆశీర్వాదం ఉందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.