పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని
పరిశీలించిన మంత్రి తుమ్మల
ఖమ్మం,జూన్ 26: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆయిల్ పామ్ హబ్గా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కల్లూరుగూడెం వద్ద కొత్తగా నిర్మిస్తున్న పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పనులను స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పామాయిల్ సాగు విస్తరణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతుండగా, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు 70 లక్షల ఎకరాలకు సాగు విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 36 శాతం సాగు విస్తరణతో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
దిగుమతి సుంకం పెంపుపై కేంద్రానికి విజ్ఞప్తి
వంట నూనెల దిగుమతుల కోసం దేశం ఏటా లక్ష కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచితే దేశీయ రైతులకు మద్దతు ధర మెరుగవుతుందని మంత్రి తుమ్మల వివరించారు. ఈ అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిని ఇటీవల దిల్లీలో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టన్ను పామాయిల్ ఫ్రూట్ బంచ్ ధర రూ.23,852గా ఉండగా, దీన్ని రూ.25 వేలకు కనీస గ్యారంటీ ధరగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్లు గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫ్యాక్టరీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు, సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఒక పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం, కొణిజర్ల, గద్వాల జిల్లా బీచుపల్లి, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో ఫ్యాక్టరీల నిర్మాణం పురోగతిలో ఉందని వివరించారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్టు నెలలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు అండగా ప్రభుత్వం
రైతుభరోసా, రైతుబీమా పథకాలతో పాటు ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. పది లక్షల ఎకరాలకు సాగు విస్తరిస్తే రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరగడంతోపాటు, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో పామాయిల్ సాగు కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటగా రైతులు పామాయిల్ సాగును చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ఫెడ్, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.