మంగళగిరి నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి లోకేష్ శంకుస్థాపన
6.3 కోట్లతో యాగశాల, వాహనశాల, గంటా మండపం నిర్మాణాలు
1 / 2
మంగళగిరి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంగళగిరి దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రిని అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం నూతన యాగశాల నిర్మాణంతో పాటు వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం, శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ పనులకు మంత్రి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన నమూనా చిత్రాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని, రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.
దేవాదాయ శాఖ నిధుల నుంచి రూ.6.3 కోట్ల వ్యయంతో శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంటా మండపం, వాహనశాల పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆలయం మొత్తం కలియతిరిగిన మంత్రి లోకేష్ అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అవసరమైన వసతుల కల్పన, ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు చేపట్టాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శన సౌకర్యం, నిత్యప్రసాద ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరిణిని పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి, అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.