రైతుల అవసరాలే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు
మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఆగస్టు 18: రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని, పరిశోధనల ఫలితాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరుగా రైతుల చెంతకు చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యాన రంగానికి నూతన దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక ముందడుగుగా పరిశోధనా సముదాయం నిలుస్తుందన్నారు. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, ప్రయోగశాలల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతులకు ఆశించిన స్థాయిలో చేరడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి మాధ్యమాలు అందుబాటులో ఉన్నందున వీడియోలు, షార్ట్ఫిల్మ్లు, ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా రైతులకు సులభంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ఉద్యాన పంటల వాటా 26 శాతం
రాష్ట్ర వ్యవసాయ భూమిలో ఉద్యాన పంటలు సుమారు ఆరు శాతం మాత్రమే ఉన్నప్పటికీ వ్యవసాయ స్థూల విలువలో వాటి వాటా 26 శాతం, సుమారు రూ.30,346 కోట్లుగా ఉందని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఉద్యాన రంగం కీలకమని, పరిశోధన, సాంకేతికత, విస్తరణ సేవలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
కూరగాయల దిగుమతులకు అడ్డుకట్ట
రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిలో సుమారు 70 శాతం లోటు ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి రావడం ఆందోళనకరమని తుమ్మల అన్నారు. ప్రతి జిల్లా, మండల కేంద్రంలో డెమాన్స్ట్రేషన్ ప్లాట్లు ఏర్పాటు చేసి, స్థానికంగా డిమాండ్ ఉన్న కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులు ప్రత్యక్షంగా పంటల సాగు, దిగుబడులు, ఆదాయ అవకాశాలను పరిశీలించేలా ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్లు నిర్వహించాలని చెప్పారు.
చిన్న రైతులే లక్ష్యంగా పరిశోధనలు
రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది రైతుల్లో దాదాపు 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని మంత్రి తెలిపారు. రెండు, మూడు ఎకరాల భూమి కలిగిన రైతులు భారీ పెట్టుబడులతో కూడిన యంత్రాలు, సాంకేతికతను స్వయంగా వినియోగించుకోలేరని అన్నారు. తక్కువ ఖర్చుతో చిన్న కమతాల్లో అమలు చేయగల యంత్రాలు, సాంకేతికత, సాగు విధానాలపై పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
మూడేళ్లలో లక్ష్యాలు.. క్షేత్రస్థాయిలో ఫలితాలు
ప్రతి మూడు సంవత్సరాలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని పరిశోధనా ఫలితాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేలా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ–ఉద్యాన శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు. గ్రామీణ యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించి, వ్యవసాయంలో ఉపయోగపడే కొత్త యంత్రాలు, పరికరాల ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
ఆయిల్పామ్ 10 లక్షల ఎకరాలకు
తెలంగాణ ఆయిల్పామ్ సాగు విస్తరణలో దేశంలో ముందంజలో ఉందని తుమ్మల తెలిపారు. రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఆయిల్పామ్తో పాటు కోకో, జాపత్రి వంటి అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం లభించేలా పరిశోధనా కేంద్రాలు, డెమాన్స్ట్రేషన్ ఫారాల్లో నమూనా సాగును ప్రదర్శించాలని సూచించారు.
పంట అనంతర నష్టాలపై దృష్టి
ఉద్యాన పరిశోధనలను ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా రైతుల పొలాల్లోకి తీసుకెళ్లాలని మంత్రి అన్నారు. కూరగాయలు, పూలు, ద్రాక్ష, ఔషధ, సుగంధ పంటలపై పరిశోధనలను సమన్వయం చేసేందుకు హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్ ఏర్పాటు కీలక ముందడుగన్నారు. ఉత్పత్తి పెంపుతో పాటు పంట అనంతర నష్టాలను తగ్గించే సాంకేతికతపై కూడా పరిశోధనలు జరగాలని సూచించారు.
రసాయన అవశేషాలు తగ్గించాలి
రైతులు అధికంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా శాస్త్రీయ సూచనల మేరకు సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించేలా అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. పంటల్లో రసాయన అవశేషాలను తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ ఉత్పత్తులకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని తెలిపారు.
జిల్లాల్లో పరిశోధనలు విస్తరించాలి
డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగు విధానాలను విస్తృతంగా ప్రోత్సహించి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ కార్యకలాపాలను విస్తరించాలని కోరారు. ప్రభుత్వ సీడ్ఫారాలు, అందుబాటులో ఉన్న ఇతర భూములను వినియోగించుకొని జిల్లాల వారీగా పరిశోధన, శిక్షణ, డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
రైతు ఆదాయమే కేంద్రంగా విధానాలు
వ్యవసాయమే భవిష్యత్తు అని తుమ్మల అన్నారు. కరోనా సమయంలో అన్ని రంగాలు దాదాపు నిలిచిపోయినా రైతు వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించారని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలకు వ్యవసాయాన్ని మరింత ఆకర్షణీయమైన, లాభదాయకమైన వృత్తిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ తదితర అనుబంధ రంగాలన్నీ రైతు కేంద్రంగా పనిచేయాలని, రైతు కష్టాన్ని తగ్గించడం, ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పరిశోధనలు, విధానాలు రూపొందించాలని పిలుపునిచ్చారు.
నాణ్యమైన విత్తనాల సమస్య పరిష్కారానికి విత్తన ప్రాసెసింగ్ యూనిట్, మహిళా రైతులు, గ్రామీణ యువతకు శిక్షణతో పాటు కొత్త వ్యాపార అవకాశాల కల్పనకు మష్రూమ్ ఉత్పత్తి యూనిట్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి తెలిపారు. హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్ ద్వారా పరిశోధన–సాంకేతికత–రైతుల మధ్య అనుసంధానం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.