కార్యకర్త నుంచి జాతీయ నాయకత్వం దాకా...
విష్ణువర్ధన్ రెడ్డి స్ఫూర్తిదాయక ప్రస్థానం
రాజకీయాల్లో ఓ సాధారణ కార్యకర్త ఎదుగుదలకు ఎన్ని మెట్లు ఎక్కాలో, ఎంత సహనం కావాలో చెప్పే కథ ఇది. సత్యసాయి జిల్లా కదిరిలో ఆర్ఎస్ఎస్ భావజాల కుటుంబంలో పుట్టిన ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, 1992లో ఏబీవీపీ కార్యకర్తగా తన ప్రజాజీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఆ ప్రయాణం ఇప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వంలో కీలక బాధ్యత వరకు చేరడం, పార్టీ శ్రేణులకే కాదు యువతకూ స్ఫూర్తినిచ్చే అంశంగా నిలుస్తోంది.
అంచెలంచెలుగా ఎదిగిన అనుభవం
ఏబీవీపీలో పలు రాష్ట్రస్థాయి పదవుల్లో పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి, ఆ తర్వాత బీజేవైఎం, బీజేపీలో వివిధ రాష్ట్ర, జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టారు. ప్రతి బాధ్యతనూ సవాలుగా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయన, 2012 నుంచి 2016 వరకు రెండుసార్లు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2018–2021 మధ్య నెహ్రూ యువ కేంద్ర సంఘటన్కు జాతీయ స్థాయి వైస్ ఛైర్మన్గా సేవలందించి, తన సామర్థ్యాన్ని జాతీయ వేదికపై చాటుకున్నారు. రాష్ట్ర బీజేపీలో రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా, ఒకసారి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ సంస్థాగతంగా తనదైన ముద్ర వేశారు.
వాదనా పటిమతో గుర్తింపు
విద్యా, యువజన రంగాల్లో చురుకైన పాత్ర పోషించిన విష్ణువర్ధన్ రెడ్డి, మీడియా, టీవీ చర్చావేదికల్లో పార్టీ విధానాలను సమర్థంగా వినిపించే నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వాదనా పటిమ, సంస్థాగత అనుభవం కలబోతగా ఆయన నిర్మించుకున్న ఈ ప్రస్థానం, నేటి యువ కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తోంది.
జాతీయ వేదికపైకి...
తాజాగా బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనను జాతీయ 'ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్'గా నియమించింది. మధ్యప్రదేశ్కు రెండుసార్లు అధ్యక్షుడిగా, ఖజురహో ఎంపీగా పనిచేసిన విష్ణుదత్ శర్మ ప్రస్తుతం జాతీయ 'ఆల్ సెల్స్ కో-ఆర్డినేటర్'గా వ్యవహరిస్తుండగా, నితిన్ నభీన్ నేతృత్వంలోని జాతీయ కమిటీలో పార్టీ అనుబంధ విభాగాలు, సెల్స్ సమన్వయ బాధ్యతలు నిర్వహించే ఈ బృందంలో విష్ణువర్ధన్ రెడ్డి భాగస్వామిగా చేరారు.
ఒక సాధారణ కార్యకర్తగా మొదలైన ప్రయాణం ఈ రోజు జాతీయ స్థాయి బాధ్యత వరకు చేరడం, దశాబ్దాల నిబద్ధత, సంస్థాగత కృషికి దక్కిన ఫలితంగా పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. నేల స్థాయి నుంచి ఢిల్లీ వేదిక వరకు సాగిన ఈ ప్రస్థానం, కృషి ఉంటే ఏ లక్ష్యమైనా అందుకోవచ్చని చాటిచెబుతోంది.