చంద్రుడిపై మానవుడి తొలి అడుగుకు 57 ఏళ్లు
సరిగ్గా ఇదే రోజు..
1969 జులై 20న చరిత్ర సృష్టించిన అపోలో-11
మనిషి తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టి నేటికి (జులై 20) సరిగ్గా 57 ఏళ్లు పూర్తయ్యాయి. 1969 జులై 20న అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్ర ఉపరితలంపై కాలుమోపి, మానవాళి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టానికి తెరతీశారు.
అపోలో-11 ప్రయాణం
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1969లో అపోలో-11 వ్యోమనౌకలో ముగ్గురు వ్యోమగాములను చంద్రుడి వైపు పంపింది. వీరిలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఇ. ఆల్డ్రిన్ చంద్ర ఉపరితలంపై దిగగా, మైకేల్ కొలిన్స్ కమాండ్ మాడ్యూల్లోనే ఉండి కక్ష్యలో పరిభ్రమించారు. చంద్రుడిపై తొలిసారి కాలుమోపిన ఘనత ఆర్మ్స్ట్రాంగ్దే. ఆయన దిగిన సుమారు 20 నిమిషాల తర్వాత ఆల్డ్రిన్ కూడా చంద్ర ఉపరితలంపైకి అడుగుపెట్టారు. వీరిద్దరూ దాదాపు 21 గంటలపాటు చంద్ర మండలంపై గడిపి, పరిశోధనలు, నమూనాల సేకరణ చేపట్టారు.
తొలి ప్రయత్నాలు రష్యావే
చంద్రుడిపై పరిశోధనలకు తొలిసారి బీజం వేసింది సోవియట్ రష్యానే. 1959లో ‘లూనిక్-2’ వ్యోమనౌకను చంద్రుడిపైకి పంపి విజయం సాధించిన రష్యా, తర్వాత లూనిక్-3 ద్వారా చంద్రుడి ఫొటోలు తీసింది. ఈ ప్రయోగాల స్ఫూర్తితో నేరుగా వ్యోమగాములనే చంద్రుడిపైకి పంపాలన్న సాహసోపేత నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది.
అరకొర సాంకేతికతతోనే అద్భుతం
అప్పటి అపోలో గైడెన్స్ కంప్యూటర్లో ఉపయోగించిన మెమరీ నేటి స్మార్ట్ఫోన్లతో పోలిస్తే అత్యల్పం. దీనికి కేవలం 2,048 వర్డ్స్ (సుమారు 4 కేబీ) ర్యామ్, 36 వేలకుపైగా వర్డ్స్ (సుమారు 72 కేబీ) రోమ్ మాత్రమే ఉండేవి. టెక్నాలజీ ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న ఆ కాలంలోనే, ఇంతటి పరిమిత సాంకేతిక సదుపాయాలతో నాసా మనిషిని చంద్రుడిపైకి పంపి విజయం సాధించడం అపూర్వమైన ఘనతగా చరిత్రకారులు అభివర్ణిస్తారు.