అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు
స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దన్న సీఎం చంద్రబాబు
అమరావతి, జూన్ 19: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల అమలుపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాలుష్య నియంత్రణ, వ్యర్థాల సద్వినియోగం, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 11,400 ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశామని, మిగిలిన 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెలాఖరులోగా పంపిణీ పూర్తిచేయాలని సూచించారు. ఇండక్షన్ స్టవ్ల వినియోగంతో ఒక్కో కేంద్రానికి నెలకు రూ.247 వరకు ఆదా అవుతోందని తెలిపారు.
రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కడప, కర్నూలు జిల్లాల్లో శనివారం శంకుస్థాపన జరగనుండగా, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో నిర్మాణ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని అధికారులు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ-ఆటోలు, కాంపాక్టర్లు, స్వీపింగ్ మిషన్లను నిర్దేశిత గడువుల్లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో 33 ఎస్టీపీల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.