విశ్వనగరిగా అమరావతి ఎదగాలని జగన్నాథుడిని వేడుకున్న సీఎం
చంద్రబాబు
1 / 2
అమరావతిలో జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభం
ఆధ్యాత్మికతే ఒత్తిడికి విరుగుడు: సీఎం చంద్రబాబు
సంప్రదాయబద్ధంగా రథం ముందు బంగారు చీపురుతో ఊడ్చిన సీఎం
అమరావతి, జూలై 16:
రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించే అత్యుత్తమ మార్గం ఆధ్యాత్మికత ఒక్కటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమాజాన్ని ప్రశాంతంగా ఉంచేవి దేవాలయాలేనని పేర్కొన్నారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో బుధవారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
మానవ సంబంధాలపై ఆందోళన
సమాజంలో మానవ సంబంధాలు క్షీణించి, సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం పెరుగుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దీని ఫలితంగానే కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాల వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రజల జీవితాల్లో ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత చేకూరేందుకు ఆధ్యాత్మికతే సరైన మార్గమని వివరించారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 5 వేల శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు.
సంప్రదాయబద్ధంగా రథయాత్ర
పూరీ క్షేత్రంలో నిర్వహించే సంప్రదాయ క్రతువులను అనుసరిస్తూ జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో కూడిన రథం ముందు ముఖ్యమంత్రి బంగారు చీపురుతో ఊడ్చి పరిశుభ్రం చేశారు. అనంతరం తాడు లాగి రథయాత్రను ప్రారంభించారు. అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళిక చిత్రపటాన్ని శిరస్సుపై ధరించి, అమరావతి విశ్వనగరిగా ఎదగాలని జగన్నాథ స్వామిని ముఖ్యమంత్రి వేడుకున్నారు.
ఉమ్మడి కుటుంబాలే మేలు: సీఎం
భారతీయ సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని, మైక్రో ఫ్యామిలీలు కాదని సీఎం అభిప్రాయపడ్డారు. పూరీ క్షేత్ర రథయాత్రకున్న ప్రత్యేకతను అమరావతిలో తొలిసారి పునరావృతం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తామని ఇస్కాన్ సంస్థ ప్రకటించినట్టు తెలిపారు.
సేవా కార్యక్రమాలపై ప్రస్తావన
ఆధ్యాత్మికత, ప్రజాసేవ రంగాల్లో ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్ లు కృషి చేస్తున్నాయని సీఎం కొనియాడారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 25 వేల పాఠశాలల్లో ఆహారం అందిస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 10 సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా 1.80 లక్షల మంది విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఇస్కాన్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పి.నారాయణ, తెనాలి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.