తెలంగాణ సహకార రంగంపై ఇరాన్ ప్రతినిధి బృందానికి వివరించిన
మంత్రి తుమ్మల
సచివాలయంలో ఇరాన్ ఉన్నతస్థాయి బృందంతో సమావేశం
హైదరాబాద్, జూలై 16: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి గురువారం సచివాలయంలో ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరాన్ సహకార, కార్మిక, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెయిదారి, సహకార శాఖ ఉపమంత్రి డాక్టర్ సర్ఫీ, భారత్లోని ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫత్ అలీ, హైదరాబాద్లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ హమీద్ అహ్మదియే, వైస్ కాన్సుల్ మొహసిన్ మొగద్దామీ, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి హషేమీ పాల్గొన్నారు.
సహకార రంగంలో రాష్ట్ర పురోగతిపై వివరణ
తెలంగాణలో సహకార ఉద్యమం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందిస్తున్న సేవలు తదితర అంశాలను మంత్రి తుమ్మల ప్రతినిధి బృందానికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో అమలవుతున్న సహకార విధానాలు, సంస్థాగత సంస్కరణలు, సభ్యులకు అందిస్తున్న సేవలపై ఇరాన్ ప్రతినిధి బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో సహకార రంగంలో పరస్పర అనుభవాల మార్పిడి, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి.
ప్రతినిధి బృందానికి ఘన సత్కారం
సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇరాన్ ప్రతినిధి బృంద సభ్యులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ప్రతినిధి బృందం సైతం మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది.