కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల్లో అవినీతి
మాజీ మంత్రి పువ్వాడ
ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అవినీతి, దోపిడీకి గురై కునారిల్లిన ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ ప్రాజెక్టులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు రూపంలో పునర్జీవం పోసి ప్రగతి పథంలో నడిపించారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిందని, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట దోపిడీకి పాల్పడి ప్రాజెక్టులను అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మార్చిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
10 లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, గోదావరి జలాలను ఒడిసిపట్టి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టిందని పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.9 వేల కోట్లు వెచ్చించి, 100 కిలోమీటర్లకు పైగా ప్రధాన కాలువలు, పంప్హౌస్లు, పైప్లైన్లు, ట్రాన్స్మిషన్ వ్యవస్థలను నిర్మించామని వెల్లడించారు. అధిక సామర్థ్యం గల మోటార్లు, ఆధునిక యాంత్రిక పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు పనుల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు వివరించారు.
90 శాతం పూర్తయిన నిర్మాణం
భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు వంటి క్లిష్టమైన అంశాలను పరిష్కరించి, ప్రాజెక్టు నిర్మాణాన్ని 90 శాతం వరకు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగానికి సాగర్ ఆయకట్టుకు శాశ్వత సాగునీటి భరోసా కల్పించడం, వ్యవసాయాభివృద్ధి, భూగర్భ జలాల పెంపు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును రూపుదిద్దారని పేర్కొన్నారు.
కాంగ్రెస్పై విమర్శలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు సీతారామ ప్రాజెక్టుకు తాము ఎంత మేర నిధులు ఖర్చు చేశారో, ఏం చేశారో ప్రజలకు చెప్పుకునే విషయాలు లేకపోవడంతో కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగుతున్నారని పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులనే తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ మంత్రులు చేయడం ప్రజలను మోసం చేయడమేనని, ఎవరి కృషి ఏమిటో వాస్తవాలు ప్రజలకు స్పష్టంగా తెలుసని ఆయన స్పష్టం చేశారు.