మెట్రో రెండో దశ నిధులపై కేంద్రం దృష్టికి సీఎం రేవంత్
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ
1 / 2
న్యూఢిల్లీ,జూన్ 23: హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం, నిధుల సమీకరణ అంశాలపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. సోమవారం రాత్రి ఢిల్లీలోని రైల్వే భవన్లో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఈ భేటీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
మెట్రో ఫేజ్-2 నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై ఈ సందర్భంగా చర్చించారు. భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ రుణం విడుదలలో జాప్యంపై సీఎం ఇంతకుముందే అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. నిబంధనల ప్రకారం రూ.84.32 కోట్ల అడ్వాన్స్ ఫీజు చెల్లించినా తొలి విడత రుణం విడుదల కాలేదని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.
భేటీ అనంతరం మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడుతూ, రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా సాగాయని తెలిపారు. మెట్రో ఫేజ్-2 నిధుల విడుదలపై మంగళవారం ఉదయం కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలవనున్నట్లు వెల్లడించారు.
ఇదే పర్యటనలో సీఎం, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని సమగ్ర సదుపాయాలతో అభివృద్ధి చేయాలని కోరారు. హైదరాబాద్లో ఎస్బీఐ భూ వివాదం, మెట్రో రుణ సమస్యలపై పరిష్కారం కోసం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ కానున్నారు.