సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి
ఘనంగా నివాళులు
విజయవాడ:కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా సంగీత ప్రియులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. 1930 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తంలో సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య దంపతులకు జన్మించిన బాలమురళి, బాల్యంలోనే తల్లిని కోల్పోయినప్పటికీ ఏడో ఏట నుంచే కచేరీలు ప్రారంభించి సంగీత రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచారు.
బాల్యం నుంచే సంగీత సాధన
తొమ్మిదేళ్ల వయసుకే వయోలిన్, మృదంగం, కంజీర వాయిద్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన బాలమురళి, కుమారుడి ప్రతిభను గుర్తించిన తండ్రి పట్టాభిరామయ్య ఆయనను గాయక బ్రహ్మ పారుపల్లి రామకృష్ణయ్య వద్ద శిష్యరికానికి పంపారు. ఆ తర్వాత కొంతకాలం విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. అనంతరం మద్రాసులో స్థిరపడి తమిళ, కన్నడ, మలయాళ భాషలపైనా పట్టు సాధించారు.
30 వేలకుపైగా కచేరీలు
తన సుదీర్ఘ సంగీత జీవితంలో 30 వేలకుపైగా కచేరీలు నిర్వహించిన బాలమురళి, అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, ఎంకిపాటలు, తత్వాలు, లలిత గీతాలు, భక్తి గీతాలను అలవోకగా ఆలపించారు. 72 మేళకర్తల్లో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడిగా, లవంగి, త్రిశక్తి, మహతి వంటి కొత్త రాగాలను సృష్టించిన సృజనశీలిగా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు.
సినీ రంగంలోనూ ప్రతిభ
భక్త ప్రహ్లాద చిత్రంలో నారదుడి పాత్రలో మెప్పించిన బాలమురళి, కన్నడ చిత్రం హంసగీతేకు సంగీత దర్శకత్వం వహించడంతోపాటు ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు. మధ్వాచార్య చిత్రానికిగాను జాతీయ స్థాయి పురస్కారం దక్కించుకున్నారు.
బిరుదులు, అవార్డులు
గానసుధాకర, సంగీత సామ్రాట్, సంగీత కళాసరస్వతి, కళాప్రపూర్ణ, గానగంధర్వ వంటి వందలాది బిరుదులు అందుకున్న బాలమురళి, ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక షేవలియర్ అవార్డు పొందిన ఏకైక కర్ణాటక సంగీత విద్వాంసుడిగా చరిత్రకెక్కారు. ఆయన జయంతి సందర్భంగా సంగీత లోకం నివాళులర్పిస్తోంది.