భద్రాద్రి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో కీలక అడుగులు
సీతంపేట, సుజాతనగర్లే అనుకూలం
ఖమ్మం,: భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసుల దశాబ్దాల కల అయిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సాకారానికి చేరువైంది. గతంలో ప్రతిపాదించిన రెండు స్థలాలు సాంకేతిక, ఆర్థిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో, జిల్లా యంత్రాంగం స్వతంత్ర సంస్థ 'రాజ్ టెక్నాలజీస్'తో చేయించిన సాధ్యాసాధ్యాల నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడుకు జులై 4న అందజేశారు.
ఏటీఆర్-72-600 తరహా విమానాలకు అనుగుణంగా జిల్లాలోని ఆరు ప్రాంతాలను పరిశీలించగా, సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలు అనుకూలమైన భూతలం, భూవినియోగంతో సాంకేతిక ప్రమాణాలకు తగినట్టు తేలింది. సుమారు 667 ఎకరాల్లో ఎలాంటి ప్రధాన అవరోధాలు లేకుండా అభివృద్ధి చేపట్టవచ్చని నివేదిక పేర్కొంది.
గిరిజన, పారిశ్రామిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఈ జిల్లాలో సింగరేణి గనులు, హెవీ వాటర్ ప్లాంట్ వంటి పరిశ్రమలతోపాటు భద్రాచలం క్షేత్రానికి లక్షలాది భక్తులు వస్తుంటారని, విమానాశ్రయం వల్ల పెట్టుబడులు, పర్యాటకం, అభివృద్ధికి ఊతం లభిస్తుందని మంత్రి తుమ్మల తన లేఖలో పేర్కొన్నారు. ఫీజిబిలిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.