దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి లోకేష్
ఈనెల 5 నుంచి 11 వరకు
అమరావతి: భారత్-దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆహ్వానం మేరకు ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆరు రోజులపాటు ఆయన ఈ పర్యటన చేపడుతున్నారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతోనే ఈ అధికారిక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన కీలక అడుగు కాగలదని దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ (చెన్నై) చాంగ్ న్యూన్ కిమ్ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
రోజువారీగా షెడ్యూల్
ఈనెల 5న సియోల్లో జరిగే ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశంలో పాల్గొని అక్కడి భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. 6న టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంతోపాటు పెట్టుబడి చర్చల్లో పాల్గొంటారు. అనంతరం హ్యోసంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు. 7న ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్ జు కోహ్ ఏర్పాటు చేసిన విందు సమావేశంలో పాల్గొంటారు. దీనికి ఎల్జీ అనుబంధ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలు హాజరుకానున్నాయి.
8న కొరియన్ మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొంటారు. 9న కొరియన్ పొలిటికల్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ యుయి-హే సిసిలియా చుంగ్, అనంతరం ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డిప్యూటీ మినిస్టర్ కాంచన్ కాంగ్తో వేర్వేరుగా సమావేశమవుతారు. 10న వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలు, కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు రాత్రి సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026ను విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్షోలో పాల్గొంటారు.