గాన కోకిల" మూగబోయింది
జానకమ్మ అస్తమయం
48 వేలకు పైగా గీతాలతో తెలుగు హృదయాలను గెలుచుకున్న గాన సామ్రాజ్ఞి కన్నుమూత
మైసూరు:
భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక అపూర్వ అధ్యాయం ముగిసింది. తెలుగు నేల మీద పుట్టి, దక్షిణాది భాషలన్నింటినీ తన గాత్రంతో ఏలిన "గానకోకిల" ఎస్. జానకి (88) శనివారం మైసూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. వయోభారంతో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ వర్గాలు తెలిపాయి. రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఈ విషాద వార్తను ఆమె మనవరాలు అప్సర వైద్యుల ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
రేపల్లె నుంచి జాతీయ ఖ్యాతి దాకా
1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన సిస్త్లా శ్రీరామమూర్తి జానకి, మేనమామ సూచనతో చెన్నై చేరి సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం వద్ద గాయనిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విళయాట్టు'తో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, అదే ఏడాది తెలుగులో 'ఎం.ఎల్.ఏ' చిత్రంతో పరిచయమయ్యారు. తొలి ఏడాదిలోనే ఆరు భాషల్లో పాటలు పాడి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
ఆరు దశాబ్దాల అవిరళ గానం
20కి పైగా భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు స్థాయి ఘనత సాధించిన జానకమ్మ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీ, ఒడియా, తుళు, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ వంటి భాషల్లోనూ, ఆంగ్లం, జపనీస్, జర్మన్, సింహళ భాషల్లోనూ తన గాత్రాన్ని వినిపించారు. తెలుగులో 'బావ మరదళ్లు', 'పూజాఫలం', 'బంగారు పంజరం' వంటి చిత్రాల్లోని ఆమె పాటలు నేటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ రాజ్కుమార్ వంటి దిగ్గజ గాయకులతో ఆమె పాడిన యుగళ గీతాలు చిరస్మరణీయం. 2017 అక్టోబరు 28న మైసూరులో జరిగిన కచేరీతో తన 60 ఏళ్ల సంగీత ప్రస్థానానికి ఆమె విరామం ప్రకటించారు.
పురస్కారాల పంట, పద్మభూషణ్ తిరస్కరణ
4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 వివిధ రాష్ట్ర పురస్కారాలు, తెలుగులో 12 నంది అవార్డులు అందుకున్న జానకమ్మకు మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. తమిళనాడు ప్రభుత్వం 'కళైమామణి' బిరుదుతో, కర్ణాటక ప్రభుత్వం 'రాజ్యోత్సవ ప్రశస్తి'తో ఆమెను సత్కరించింది. అయితే 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని, "ఆలస్యంగా వచ్చింది, తనకు భారతరత్న దక్కాల్సి ఉంది" అంటూ నిర్మొహమాటంగా తిరస్కరించి సంచలనం సృష్టించారు.
సంతాప సంద్రంలో సినీ, రాజకీయ లోకం
జానకమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ఆంధ్రప్రదేశ్త ముఖ్యమంత్రి చంద్రబాబు,తమిళనాడు సీఎం, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె గాత్రం లక్షలాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకుందని, ఆమె మృతితో సంగీత ప్రపంచం మూగబోయిందని నేతలు కొనియాడారు.
భౌతికంగా జానకమ్మ మన మధ్య లేకపోయినా, ఆరు దశాబ్దాలపాటు తెలుగు ప్రజల గుండెల్లో నిండైన మధురిమలు నింపిన ఆమె గీతాలు తరతరాలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ దివ్య గాత్రానికి అశ్రుతర్పణలు!