పవన్ కళ్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి
అమరావతి/ముంబై: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబై చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కొంతసేపు మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
రొటేటర్ కఫ్ గాయం, కండరాల సమస్యతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్, పలు అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం శనివారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఒకేసారి రెండు భుజాలకూ శస్త్రచికిత్స చేస్తే కోలుకునే సమయంలో తీవ్ర నొప్పి తలెత్తుతుందని భావించిన వైద్యులు, ముందుగా కుడి భుజంలోని రొటేటర్ కఫ్ గాయానికి మాత్రమే శనివారం ఉదయం సుమారు మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. మిగిలిన ఎడమ భుజం సమస్యకు రెండు నెలల అనంతరం మరో శస్త్రచికిత్స చేయాలని వైద్యులు యోచిస్తున్నారు.
శస్త్రచికిత్స జరిగిన వెంటనే సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పూర్తి ఆరోగ్యంతో వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆదివారం స్వయంగా ముంబై వెళ్లి ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ను ప్రత్యక్షంగా పరామర్శించారు. కోలుకుంటున్న తీరుపై వైద్యులతోనూ చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్కు వైద్యులు సూచించారు.
ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్తో పాటు జనసేన శ్రేణులు, అభిమానులు, పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.