రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి
భరణి
హైదరాబాద్, జులై 14: మాటలతో నవ్విస్తారు... పాత్రలతో ఆలోచింపజేస్తారు... సందర్భం ఏదైనా తన ప్రత్యేక శైలితో ప్రేక్షకుల మనసు గెలుచుకునే బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ళ భరణి. కామెడీ కావొచ్చు, విలనీ కావొచ్చు, ఉదాత్త పాత్ర కావొచ్చు- ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడిగా, తెలంగాణ యాసలో సూటిగా సంభాషణలు రాసే రచయితగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయన నేటితో 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1954 జులై 14న పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాధపురంలో జన్మించిన భరణి, ఇప్పటివరకు దాదాపు 320 చిత్రాల్లో నటించి, తనదైన ముద్ర వేశారు.
నాటకరంగంలో తొలి అడుగులు
ఇంటర్మీడియట్ చదివే వరకు రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి చూపని భరణి, హైదరాబాద్లోని రైల్వే కళాశాలలో నాటకం రాయాల్సి వచ్చిన సందర్భంలో 'అద్దె కొంప' అనే నాటకాన్ని రచించి తొలి బహుమతి అందుకున్నారు. బి.కాం చదివే రోజుల్లో ప్రముఖ నటుడు రాళ్ళపల్లితో పరిచయమై, ఆయన నాటక సంస్థ 'శ్రీ మురళీ కళానిలయం' కోసం పది నాటకాలు రచించారు. వీటిలో స్త్రీవాద దృక్పథంతో రాసిన 'గోగ్రహణం' నాటకానికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం విశేషం.
సినీరంగ ప్రవేశం, నట ప్రస్థానం
భరణి రచించిన 'చల్ చల్ గుర్రం' నాటకాన్ని చూసిన నిర్మాత రామరాజు హనుమంతరావు, దర్శకుడు వంశీకి పరిచయం చేయడంతో 'కంచుకవచం' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం 'లేడీస్ టైలర్', 'శివ' వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'మొండి మొగుడు - పెంకి పెళ్ళాం' చిత్రంలో పూర్తి తెలంగాణ యాసలో సంభాషణలు అందించిన భరణి, 'యమలీల', 'అతడు', 'రాజా ది గ్రేట్' వంటి చిత్రాల్లోని సంభాషణలతో ప్రేక్షకుల నోళ్లలో నానుతున్నారు.
పురస్కారాలు, గుర్తింపు
'సముద్రం' చిత్రంలో ఉత్తమ ప్రతినాయకుడిగా,'మిథునం' చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారాలు అందుకున్న భరణికి, 2024 జులై 25న వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. నక్షత్ర దర్శనం, పరికిణీ, ఎందరో మహానుభావులు వంటి రచనలతోపాటు ఇటీవల 'దూత', 'బెంచ్ లైఫ్' వెబ్ సిరీస్లలోనూ తన ప్రతిభ చాటుకున్నారు. ఆయన జన్మదిన సందర్భంగా అభిమానులు, సినీ, సాహిత్య రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.