బిజినెస్ రూల్స్లో సంస్కరణలు
సీఎం చంద్రబాబు
అమరావతి,జూలై 14: ప్రభుత్వ పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ, అవసరం లేని బిజినెస్ రూల్స్ను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ను తిరిగి రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, తగిన సంస్కరణలు తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం (ఆర్టీజీఎస్)లో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
దేవాదాయ, రహదారులు- భవనాలు, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక, వ్యవసాయ శాఖలు అందిస్తున్న సేవలు, వాటిపై ప్రజల నుంచి వ్యక్తమవుతున్న సంతృప్తి స్థాయిని సీఎం సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. ప్రజలకు ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు సరైన నాయకత్వం అందించినప్పుడే చిట్టచివరి వ్యక్తి వరకూ పాలనా ఫలితాలు చేరతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలు క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు ఇచ్చేలా నిర్ణయాలు ఉండాలని సూచించారు.
దేవాదాయ శాఖ పరిధిలో ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, సరైన ప్రణాళికతో వాటిని గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ దేవాలయాల పరిసరాల్లో ఆర్థిక కార్యకలాపాలతో పాటు పర్యాటక కార్యకలాపాలు కూడా విస్తృతం కావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి అన్ని ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సేకరించాలని, ప్రతి అర్జీదారుకూ తగిన సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అగ్నిమాపక శాఖలో సేవా ప్రమాణాలను మరింత పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో యూరియా సరఫరాపై రైతు సంఘాలు, ఆర్ఎస్కేల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి, దాని దుర్వినియోగం జరగకుండా చూడాలని సూచించారు.
మానవీయ కోణంలో అర్జీల పరిష్కారం
క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు తప్పిదాలు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని బస్టాండ్లలోనూ ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, బస్సులు నిర్దేశిత సమయానికి రాకపోకలు సాగించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో లభిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో కొందరి భూములను 22ఏ కింద చేర్చి వివాదాస్పదం చేశారని సీఎం విమర్శించారు. ఇప్పటివరకు 27 లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందించామని, మరో 72 లక్షల మందికి జారీ చేయాల్సి ఉందని తెలిపారు. శెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించడం ద్వారా రైతుల సమస్యలు తీరడంతో పాటు రూ.900 కోట్ల విలువైన భూమి ప్రభుత్వ పరమైందని పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను గుర్తించి అన్లాక్ చేయాలని అధికారులకు సూచించారు.
పీజీఆర్ఎస్తో పాటు వివిధ మార్గాల్లో వచ్చే ప్రతి అర్జీ, ఫిర్యాదును మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాలతో పాటు వ్యక్తిగత, సామాజిక అంశాలకు సంబంధించిన ఫిర్యాదులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రొటీన్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించినప్పుడే ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుందని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కార తీరును బట్టి వాటి సంఖ్య తగ్గుతోందా, పెరుగుతోందా అన్నది విశ్లేషించాలని సూచించారు. సమస్యలు సమర్థంగా పరిష్కారమైతే ఫిర్యాదుల సంఖ్య దానంతటదే తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ రూపొందించిన 'గవర్నెన్స్ దట్ నెవర్ స్లీప్స్' మాసపత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సమీక్షలో మంత్రి పార్థసారథి వర్చువల్గా పాల్గొనగా, ఆర్టీజీఎస్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.