బూతు సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ"
వైసీపీపై మంత్రి దుర్గేష్ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి,జూన్ 23: రాజకీయ నాయకుల ప్రవర్తనపై వైసీపీ నేతల నుంచి తాము నేర్చుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ నేతల వైఖరిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
గత ఐదేళ్లలో వైసీపీ నేతలు ప్రదర్శించిన భాషను మంత్రి దుర్గేష్ తీవ్రంగా తప్పుబట్టారు. అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, నాటి సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాతృమూర్తిపై చేసినట్లు చెప్పిన వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు.
సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడైన సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నేతృత్వంలో విచారణాధికారిని నియమించి, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సిట్ అధికారులు సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కేసును అడ్డుపెట్టుకొని ద్రాక్షారామం, కాకినాడల్లో కులాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ సమాజంలో విభజన తేవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని మంత్రి దుర్గేష్ ఆరోపించారు. ప్రతి అంశాన్నీ కులం కోణంలో చూపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఒక సామాజికవర్గానికి పరిమితం చేసే ప్రయత్నాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. తాను అన్ని కులాలను సమానంగా చూస్తానని పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కూటమి సర్కారు బలంగా కొనసాగితే భవిష్యత్తులో అధికారంలోకి రాలేమనే భయంతోనే వైసీపీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు. కాపు సంక్షేమం పట్ల వైసీపీ చిత్తశుద్ధిని ప్రశ్నించిన ఆయన, 2019-24 మధ్య కాపు కార్పొరేషన్కు నిధుల కేటాయింపు, విదేశీ విద్యా సహాయం, కాపు భవనాల నిర్మాణంపై గణాంకాలు ఉంటే చూపించాలని సవాలు చేశారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపు సంక్షేమ పథకాలను అధికారంలోకి వచ్చాక వైసీపీ రద్దు చేసిందని ఆరోపించారు. వైసీపీ నేతలు తమ భాష, ప్రవర్తన మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి దుర్గేష్ హెచ్చరించారు.