కాంగ్రెస్ పాలనలో దోపిడీ రాజ్యం:
మాజీ మంత్రి పువ్వాడ
అశ్వారావుపేట,జూన్ 23:రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో దోపిడీ రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. స్థానికంగా జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తక్కేళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలేవీ అందలేదని పువ్వాడ విమర్శించారు. వృద్ధాప్య పింఛన్లను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచుతామన్న హామీ, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న పథకం, విద్యార్థినులకు స్కూటర్లు, వివాహాలకు తులం బంగారం వంటి ఎన్నికల వాగ్దానాలు ఏవీ నెరవేరలేదని ఆయన ప్రశ్నించారు.
సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టి, కలపను నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుతున్న భూ దందాలు, మట్టి-ఇసుక మాఫియాల వెనుక మంత్రుల పాత్ర ఉందని పువ్వాడ ఆరోపించారు. బుగ్గపాడు ఫుడ్పార్క్ భూములను మార్కెట్ విలువకు విరుద్ధంగా ఒక ఆంధ్రా కంపెనీకి విక్రయించారని కూడా ఆరోపించారు. ప్రజలకు సంక్షేమం అందకపోయినా రెవెన్యూ, వ్యవసాయ శాఖల మంత్రుల ఆస్తులు వందల ఎకరాలకు పెరిగాయని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ప్రస్తావిస్తూ, ఆయన నాయకత్వం లేకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదని పువ్వాడ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచే బీఆర్ఎస్కు భారీ విజయం అందించాలని, కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేసేందుకు మొదటి సీటును ఇక్కడి నుంచే అందించాలని ఆయన ఖమ్మం జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.