గిరిజన గ్రామాలకు రూ.110 కోట్లు ఇవ్వండి
కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
1 / 2
ఖమ్మం, జూన్ 23:ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో ఏజెన్సీ, గిరిజన గ్రామ పంచాయతీలకు వరద నీటి కాలువలు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం కోసం రూ.110 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. సోమవారం రాసిన ఈ లేఖలో మండలంలోని డ్రైనేజీ సమస్యలను మంత్రి వివరించారు.
మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 28 ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో సరైన వరద నీటి కాలువలు లేక ఈ గ్రామాలు తీవ్ర నీటి నిల్వ, పారిశుధ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయని, గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వరద నీటి కాలువలు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పనులకు రూ.110 కోట్లు అంచనా వ్యయం అవుతుందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తన నియోజకవర్గ పరిధిలోని ఈ గిరిజన ప్రాంతాలకు సరిపడా స్థానిక వనరులు లేనందున, గ్రామీణాభివృద్ధి లేదా గిరిజన ప్రాంత అభివృద్ధి పథకాల ద్వారా నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని తుమ్మల కోరారు.
ప్రతిపాదిత పనులు ఈ గిరిజన ప్రాంతాల్లో పారిశుధ్యం, ప్రజారోగ్యం, జీవన పరిస్థితులు, మొత్తం మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. డీపీఆర్తో పాటు గ్రామ పంచాయతీల జాబితాను లేఖకు జతచేస్తూ, నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించాలని కేంద్ర మంత్రిని ఆయన అభ్యర్థించారు.