సమాజంలో మార్పు తెచ్చేందుకే విద్యాశాఖ
మంత్రి లోకేష్
కొక్కిలిగడ్డ (అవనిగడ్డ): సమాజంలో మార్పు తెచ్చేందుకే అత్యంత కఠినమైన విద్యాశాఖను ఎంచుకున్నానని, దీన్ని ఛాలెంజ్గా స్వీకరించానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సహకారంతోనే విద్యావ్యవస్థలో మార్పు సాధ్యమని, దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4 కోట్లతో నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను మంత్రి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తయ్యాయని, ఇక టీచర్లు పూర్తిగా ఫలితాలపైనే దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు (హార్డ్వేర్) మెరుగుపడ్డాయని, ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ (సాఫ్ట్వేర్) మెరుగుపరచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ఫార్మేటివ్, సమ్మెటివ్ టెస్టు ఫలితాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని, వెనుకబడిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్ అందజేస్తామని తెలిపారు.
ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలతో తొలిసారి యాడ్స్
ఈ ఏడాది ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చిత్రాలతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని, ఇది గతంలో ఎన్నడూ లేని పరిణామమని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను లీప్ యాప్ ద్వారా నేరుగా తనకు తెలియజేయవచ్చని, ఎంఇఓ, డిఇఓల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్-టీచర్ మీటింగ్లు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
మీరు చదవకపోతే నాకే మైనస్ మార్కులు
విద్యార్థులను ఉద్దేశించి మంత్రి చమత్కారంగా మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదివితే ముఖ్యమంత్రి తనకు మంచి మార్కులు వేస్తారని, సరిగా చదవకపోతే మైనస్ మార్కులు పడతాయని, తన భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉందని అన్నారు. యూనిఫాం, పుస్తకాలు ఇప్పటికే అందజేశామని, త్వరలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్స్, బూట్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపి బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.