అమరావతిలో బాలకృష్ణ 112వ చిత్రం ప్రారంభం
క్లాప్ కొట్టిన మంత్రి లోకేష్
1 / 3
అమరావతి: ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా ఒక భారీ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్రం పూజా కార్యక్రమం, ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి, పూజలో పాల్గొన్న అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ను లాంఛనంగా ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఇంతకుముందెన్నడూ ఏ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లలేదని, ఈ అరుదైన అవకాశం ఇచ్చిన బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. బాలకృష్ణ నాయకత్వంలో ప్రజా రాజధాని అమరావతిలో సినీ పరిశ్రమను పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా విస్తృతంగా ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని, దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అమరావతిలో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఇది పవిత్ర భూమి అని, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.