తుంగభద్ర పునరుజ్జీవం - రైతుల సంరక్షణ
33 నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు
1 / 2
హోసపేట,కర్ణాటక:తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆయా రాష్ట్రాల్లోని నదులను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఒక్కతాటిపైకి తీసుకువచ్చారని ఆయన కొనియాడారు. మూడు రాష్ట్రాల రైతులకు సాగునీటిని, ఈ ప్రాంత వాసులకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ అభివృద్ధిలో ఈ గేట్ల పునరుద్ధరణ కీలకమైనదని పేర్కొన్నారు.
తుంగా పానం, గంగా స్నానం అనే సామెతను గుర్తు చేస్తూ, తుంగ నది నీరు అంత పవిత్రమైనదని చంద్రబాబు అన్నారు. 2024లో 19వ గేటు కొట్టుకుపోయినప్పుడు స్టాప్లాక్ గేటు అమర్చి నీటిని కాపాడామని, నిపుణుడు కన్నయ్య నాయుడు సహకారంతో ఈ ప్రక్రియ విజయవంతమైందని వివరించారు. ఇప్పుడు మళ్లీ 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించామని, ఈ విషయంలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయని తెలిపారు.
1983లో ప్రధానితో పాటు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు 5 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిర్ణయించిన చారిత్రక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అదే రోజుల్లో ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల అంగీకారంతో చెన్నైకి 15 టీఎంసీల తాగునీటిని అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకేచోట కలవడం చారిత్రాత్మక అంశమని అభివర్ణించారు.
తుంగభద్ర నదీ తీరం విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి సహజ రక్షణ కవచంగా ఉందని, జోగులాంబ, హంపీ విరూపాక్ష ఆలయం, రాఘవేంద్రుడి మఠం వంటి పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరంలోనే వెలిశాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, వన్ నేషన్ వన్ గ్రిడ్, టెలికం, రహదారి నెట్వర్క్ వంటి విధానాలతో భారత్ విజయవంతమైన దేశంగా నిలుస్తోందని తెలిపారు. గంగా- కావేరి నదులను అనుసంధానించగలిగితే భారత్ ఇక ఆపలేని శక్తిగా మారుతుందని, కెన్- బెత్వా ప్రాజెక్టు ద్వారా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నదుల అనుసంధానం సాధ్యమైందని గుర్తు చేశారు. గోదావరి- కావేరి నదుల అనుసంధానం ద్వారా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు.
ఎల్నినో ప్రభావంతో తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గిందని, ఈ ఏడాది నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానం మరింత ప్రయోజనకరమని, ముందుగా అంతర్గతంగా నదులను అనుసంధానించుకుని, ఆ తర్వాత రాష్ట్రాల మధ్య అనుసంధానం చేపట్టాలని సూచించారు. రాష్ట్రాలుగా అందరూ వేర్వేరైనా, దేశంగా అంతా ఒక్కటేనని పేర్కొంటూ, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సారథ్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలపై చర్చించడం దక్షిణాది రాష్ట్రాల చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు. అందరూ కలిసి రైతుల ప్రయోజనాలను కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.