మురళీమోహన్,రాజేంద్రప్రసాద్లకు మంత్రి లోకేష్ సత్కారం
రేపు పద్మశ్రీ అవార్డుల స్వీకారం...
1 / 2
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మాగంటి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్లను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన 2026 పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డులను స్వీకరించేందుకు దిల్లీ వచ్చిన మురళీమోహన్, రాజేంద్రప్రసాద్లను మంత్రి లోకేష్ కలిసి జ్ఞాపికలతో సత్కరించారు.
వందలాది చిత్రాల్లో నటించి తెలుగు సినిమా రంగానికే వన్నె తెచ్చిన ఈ ఇద్దరు సీనియర్ నటులకు ఒకేసారి పద్మశ్రీ అవార్డులు రావడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, దివంగత నందమూరి తారక రామారావుతో తమకున్న సాన్నిహిత్యాన్ని ఇద్దరు నటులు గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులోనూ తెలుగు కళామతల్లికి తమ సేవలు అందించాలని సీనియర్ నటులను మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు పార్లమెంటు సభ్యులు కూడా మురళీమోహన్,రాజేంద్రప్రసాద్లను సన్మానించారు.