2028కి అమరావతిలో ప్రభుత్వ భవనాలన్నీ సిద్ధం
మంత్రి లోకేష్
న్యూఢిల్లీ:పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపడానికి స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు అంశాలే ప్రధాన కారణమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాంక్లేవ్లో చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎఫ్డీఐగా పేర్కొనే గూగుల్ డేటా సెంటర్ కేవలం 13 నెలల్లో, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ 17 నెలల్లో, ఏఎంసీఏ ఫైటర్ జెట్స్ ప్రాజెక్టు 37 రోజుల్లో పనులు ప్రారంభించాయని, ఈ వేగమే రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలబెడుతోందని చెప్పారు. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ఏటా 15% వృద్ధి సాధించాల్సి ఉందని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటైన మంత్రుల బృందానికి తానే ఛైర్మన్గా ఉన్నానని తెలిపారు.
ప్రస్తుతం దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని, దీనికి తమ ట్రాక్ రికార్డ్, విధానాల అమలే కారణమని పేర్కొన్నారు. ఎన్డీయేలో అత్యధిక ఎంపీలున్న పార్టీగా ఢిల్లీలో ప్రత్యేక ట్రీట్మెంట్ ఉందన్న ప్రశ్నకు స్పందిస్తూ, ప్రధానితో సాన్నిహిత్యం వల్ల కేంద్ర విధానాలను అర్థం చేసుకుని వేగంగా అమలు చేయగలుగుతున్నామని, 37 రోజుల్లోనే 600 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించామని వివరించారు. అమరావతి ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన రూ.12-13 వేల కోట్లు కేవలం ప్రారంభ మూలధనమేనని, మిగతా నిధులను రాష్ట్రమే సొంతంగా సమకూర్చుకుంటోందని స్పష్టం చేశారు.
2028 నాటికి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వంటి ప్రభుత్వ భవనాలన్నీ సిద్ధం చేస్తామని ప్రధానికి హామీ ఇచ్చామని, రాజధాని కోసం రూ.60 వేల కోట్లు సమీకరించనున్నామని తెలిపారు. విశాఖపట్నాన్ని ఐటీ, డేటా సెంటర్ల హబ్గా, అమరావతిని క్వాంటం ఎకోసిస్టమ్గా, రాయలసీమను తయారీ రంగ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. డేటా సెంటర్లకు నీటి, విద్యుత్ అవసరాలపై వచ్చిన ప్రశ్నకు, గోదావరి నుంచి ఏటా వృథాగా పోతున్న 3వేల టీఎంసీల నీటిలో కేవలం 1.5 టీఎంసీలే డేటా సెంటర్లకు అవసరమవుతాయని, పోలవరం పూర్తయ్యాక ఈ నీటిని వినియోగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ సామర్థ్యాన్ని వినియోగించుకుని విద్యుత్ అవసరాలు తీరుస్తామని, ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 17% పెరిగిందని, దేశంలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ డ్యాష్బోర్డ్ ద్వారా అన్ని శాఖల డేటాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, దీని ఫలితంగా ఈ ఏడాది దాదాపు 85,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారారని తెలిపారు. తమ పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 50% మంది, మంత్రుల్లో 17 మంది మొదటిసారి గెలిచినవారేనని వివరించారు. తాము ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ భావంతోనే పనిచేస్తామని స్పష్టం చేశారు.