ప్రజల అర్జీలు మానవీయంగా పరిష్కరించండి
సీఎం చంద్రబాబు ఆదేశం
1 / 2
అమరావతి,జూన్ 22:పీజీఆర్ఎస్తో పాటు ప్రజల నుంచి వచ్చే అర్జీలను అధికారులు, ఉద్యోగులు మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరును ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా ఉద్యోగులు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని, అర్జీదారుల స్థానంలో నిలిచి ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలు చేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తామని, పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. పౌరులతో సౌమ్యంగా వ్యవహరించడం వల్ల పాలనపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడుతుందని, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారానే వాస్తవ సమస్యలు అర్థమవుతాయని, మంత్రులు, అధికారులు ఈ విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఫైళ్ల పరిష్కారం సులభతరమైందని, నూతన ఆలోచనలు లేకుంటే వ్యవస్థలు బలహీనపడతాయని వ్యాఖ్యానించారు.
దుష్ప్రచారాలపై అప్రమత్తత, పాత కేసుల ట్రేసింగ్
రాష్ట్రంలో కొన్ని పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ, కుల, మత రంగు పూసి వివాదాస్పదం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఫేక్ ప్రచారాలతో ఉద్యోగులు, అధికారులను బద్నాం చేస్తూ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని, ఇలాంటి అంశాల్లో మరింత అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. మానసిక సమస్యలు, మత్తు పదార్థాల వ్యసనం కారణంగా కొందరు నేరాలకు పాల్పడుతున్నారని, 2019నాటి పాత కేసులను ట్రేస్ చేసి శిక్షలు విధిస్తున్నామని, నేరం చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలు పక్కాగా పాటించాలని ఆదేశించారు. డిసెంబర్లో క్వాంటం కంప్యూటర్ ప్రారంభానికి ముందు క్వాంటం పార్కు, సెమీకండక్టర్ పార్కుల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపు, పరిసరాల పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, నదీ జలాల కాలుష్య నివారణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.