ప్రజా ప్రభుత్వ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల
సీఎం చంద్రబాబు
అమరావతి,జూన్ 21: ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేసేందుకు ‘ప్రోగ్రెస్ రిపోర్ట్–2024-26’ పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలకు అనుబంధంగా యాక్షన్ టేకెన్ రిపోర్టుల మాదిరిగా ఈ నివేదికలు ఉండాలని సూచించారు.
మొత్తం 10 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేయాలని నిర్ణయించగా, వాటిలో ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్ అంశాలకు సంబంధించిన నాలుగు నివేదికలను ముఖ్యమంత్రి స్వయంగా విడుదల చేయనున్నారు. మిగిలిన ఆరు నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు విడుదల చేయనున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని ‘డెవలప్మెంట్’ నివేదికలో, సంక్షేమ పథకాలు, పీ–4 వంటి కార్యక్రమాలను ‘వెల్ఫేర్–ఎంపవర్మెంట్’ నివేదికలో పొందుపరచనున్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు, సంస్కరణలు ‘గుడ్ గవర్నెన్స్’ నివేదికలో చోటు చేసుకోనున్నాయి.
జూలై 18 నాటికి అన్ని నివేదికలను విడుదల చేసి, అనంతరం వాటిని సమగ్ర పుస్తకంగా తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రతి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేసే విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. సోమవారం విద్యుత్ రంగానికి సంబంధించిన తొలి ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల కానుంది. ఈ మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.