ఆంజనేయస్వామి ఆశీస్సులతో అనిల్ రావిపూడి
కొత్త సినిమా
1 / 2
యద్దనపూడి:వరుస విజయాలతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుల జాబితాలో నిలిచిన అనిల్ రావిపూడి తన తదుపరి భారీ ప్రాజెక్టుకు ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీకారం చుట్టారు. నూతన చిత్ర కథ (స్క్రిప్ట్)కు స్వగ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సినిమా విజయవంతం కావాలని ఆంజనేయస్వామిని ప్రార్థించారు.
బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చిలుకూరివారిపాలెంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకుడు సిద్ధం చేసిన కథ ప్రతిని ఆలయ సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు, కుంకుమలతో అలంకరించిన స్క్రిప్ట్ను ఆయన తల్లిదండ్రులు రావిపూడి బ్రహ్మయ్య, అనంతలక్ష్మిల చేతుల మీదుగా ఆశీర్వాదాలతో స్వీకరించారు.
ఈ కొత్త చిత్రంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కలయికపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వినోదంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో కథ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పూజా కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయికృష్ణ, రచయిత నారాయణ, కో-డైరెక్టర్ సూర్య, ఎడిటర్ తమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పల్నాడు జిల్లా బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో కూడా చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వగ్రామంలో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మరో విజయవంతమైన చిత్రానికి నాంది పలుకుతుందనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అనిల్ రావిపూడి మార్క్ వినోదం, స్టార్ హీరోల కలయికతో ఈ చిత్రం టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్టుగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.