మంత్రి తుమ్మల సమీక్షతో కదిలిన యంత్రాంగం
ఖమ్మం విజయ డెయిరీ పునరుద్ధరణకు కార్యాచరణ ప్రారంభం
ఖమ్మం, జూన్ 7: ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచి, రోజుకు వేల లీటర్ల పాల సేకరణతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఖమ్మం విజయ డెయిరీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం అధికారులు డెయిరీ అభివృద్ధి పనులపై దృష్టి సారించారు.
రోటరీ నగర్లో ఉన్న విజయ డెయిరీ భవనానికి తక్షణ మరమ్మతులు చేపట్టడంతో పాటు ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డెయిరీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పాల ఉత్పత్తి, సేకరణ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న మంత్రి సూచనల మేరకు సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రారంభించాయి.
సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పాడి పరిశ్రమకు ఉన్న అవకాశాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడం, పాల రవాణా మార్గాలను శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరించడం, రైతులకు సకాలంలో సేవలు అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో పాల సేకరణ వ్యవస్థను మరింత విస్తరించాలని, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పాడి రైతులకు అవసరమైన రుణాలు, సాంకేతిక సహాయం అందించేందుకు బ్యాంకులు మరియు సంబంధిత సంస్థలతో సమన్వయం చేయాలని ఆదేశించారు.
పాల ఉత్పత్తి పెంపుపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జిల్లాలో పశుసంపద పెంపకం, ఆధునిక పాడి పద్ధతుల ప్రోత్సాహం, నాణ్యమైన పాల ఉత్పత్తి మరియు మార్కెటింగ్ వ్యవస్థల అభివృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సైతం మంత్రి సూచనలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రైతుల విశ్వాసాన్ని పొందేలా పారదర్శక విధానాలతో డెయిరీ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.