కనురెప్ప కాలం కరెంట్ పోని రాష్ట్రంగా తెలంగాణ
డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రి తుమ్మల
ఖమ్మం, జూన్ 7:
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినా ఎక్కడా కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తూ తెలంగాణ "కనురెప్ప కాలం కరెంట్ పోని రాష్ట్రం"గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు అన్నారు. ఖమ్మం నగరంలోని పాకబండలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతోందని, 2023లో 15 వేల మెగావాట్లుగా ఉన్న గరిష్ట విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 18,548 మెగావాట్లకు చేరిందని తెలిపారు. అయినప్పటికీ ముందస్తు ప్రణాళికలతో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ డిమాండ్ పెరగడం రాష్ట్ర అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, డేటా సెంటర్లు, ఫార్మా సిటీ, పారిశ్రామిక విస్తరణ వంటి ప్రాజెక్టుల నేపథ్యంలో విద్యుత్ అవసరాలు మరింత పెరుగుతాయని చెప్పారు. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
2030 నాటికి 20 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 85 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రెండు మండలాల్లో వ్యవసాయ పంపుసెట్లకు వంద శాతం సోలరైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు వెచ్చిస్తోందని భట్టి తెలిపారు. అదేవిధంగా 53 లక్షల పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
రైతులకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధత అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతం అవసరమని అన్నారు. కొత్త ఉపకేంద్రం ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడటంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.