కోహెడ అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
CM revanth
1 / 2
రంగారెడ్డి,జూన్ 6: తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో శనివారం సాయంత్రం అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 240 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ను నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులకు భద్రతతో కూడిన ఆధునిక మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత కోహెడ ఫ్రూట్ మార్కెట్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తి పెంపుపై దృష్టి సారిస్తున్నామని, కందుకూరు ప్రాంతంలో టమోటా ఆధారిత సాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులకు అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ మరియు ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని సీఎం తెలిపారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి ఆధునిక సమీకృత కార్యాలయ సముదాయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా 15 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, 3.28 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్, రూ.20 వేల కోట్ల రుణమాఫీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ రాయితీ రుణాలు వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని, తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.