పొగాకు కొనుగోళ్లకు ఊపు
మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి,జూన్ 9: వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో కేంద్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు, ఎగుమతిదారులు, కొనుగోలు సంస్థలతో నిరంతర సమన్వయం కొనసాగుతోందని పేర్కొన్నారు.
పొగాకు మార్కెట్ పరిస్థితులు, కొనుగోళ్ల పురోగతి, ఎగుమతుల స్థితిగతులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల పొగాకు బోర్డు ఆధ్వర్యంలో రైతులు, కొనుగోలు సంస్థలతో సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. రైతులు, కంపెనీల అభిప్రాయాల ఆధారంగా కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
150 బేళ్ల నుంచి 700 బేళ్లకు పెరుగుదల
గత 15 రోజుల క్రితం రోజుకు సుమారు 150 బేళ్ల మేర మాత్రమే కొనుగోళ్లు జరిగేవని, ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రస్తుతం రోజువారీ కొనుగోళ్లు సగటున 700 బేళ్లకు చేరాయని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇదే వేగం కొనసాగితే వచ్చే వారం రోజుల్లో రోజుకు 1000 నుంచి 1200 బేళ్ల వరకు కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు.
కొనుగోలు సంస్థలు అవసరమైన గ్రేడ్ల వివరాలను వెల్లడించాయని, వాటి ఆధారంగా వారంవారీ కొనుగోలు లక్ష్యాలను నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. అన్ని రకాల గ్రేడ్లు అందుబాటులో ఉంటే కొనుగోళ్లు మరింత సజావుగా సాగుతాయని పేర్కొన్నారు.
ఎగుమతులపై అంతర్జాతీయ ప్రభావం
దేశంలో ఉత్పత్తి అయ్యే పొగాకులో సుమారు 70 శాతం ఎగుమతులు జరుగుతుండగా, 30 శాతం దేశీయ వినియోగానికి వెళ్తోందని మంత్రి తెలిపారు. మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, రవాణా సమస్యలు, షిప్పింగ్ కంటైనర్ల కొరత వంటి కారణాలతో ఎగుమతి రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. కంటైనర్ రవాణా ఖర్చు 1,600 డాలర్ల నుంచి 4,000 డాలర్ల వరకు పెరిగిందని వెల్లడించారు.
కేంద్రంతో చర్చలు
పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం పొగాకు బోర్డు చైర్మన్ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించినట్లు మంత్రి తెలిపారు. ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ (ఇంటరెస్ట్ సబ్వెన్షన్) కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. జీఎస్టీ భారం తగ్గించే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర దృష్టికి తీసుకెళ్లారని వెల్లడించారు.
రైతులు, కంపెనీలు, ఎగుమతిదారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రస్తుత సవాళ్లను అధిగమించవచ్చని, రైతుల ప్రయోజనాల పరిరక్షణే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.