స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు శాశ్వత అండ
మంత్రి లోకేష్
1 / 2
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలుస్తామని, కేవలం పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోబోమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
మృతుల కుటుంబాల్లో పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగి అనే తేడా లేకుండా ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి హామీ ఇచ్చినట్లు తెలిపారు. తొలి విడతగా మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. అనంతరం స్టీల్ ప్లాంట్ నిబంధనల ప్రకారం ఎక్స్గ్రేషియా, పీఎఫ్, ఇతర బకాయిలను లెక్కించి బాధిత కుటుంబాల ఖాతాల్లో జమ చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రం రూ.15 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించి ఉత్పత్తి పునరుద్ధరించిన సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ప్రమాదంపై ఇప్పటికే విచారణ కమిటీని నియమించామని, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్లో కార్మికుల కొరత లేదా ఉత్పత్తి ప్రక్రియలో లోపాల వల్ల ప్రమాదం జరగలేదని లోకేష్ స్పష్టం చేశారు. ఉక్కు ద్రవం లాడిల్ నుంచి ఒక్కసారిగా పైకి ఎగసి పడటంతో ఘటన జరిగిందని, ఇందుకు గల కారణాలపై నిపుణులు పరిశీలిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.
విశాఖ ఉక్కు దీర్ఘకాలిక అభివృద్ధికి స్లర్రీ పైప్లైన్ అవసరమని, దానిని తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడిన ఎన్డీయే ప్రభుత్వం, ఇప్పుడు కార్మికుల కుటుంబాలకు కూడా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అంతకుముందు కేజీహెచ్, సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించి, ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.