సెయింట్ పీటర్స్బర్గ్,జూన్ 4: రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ సంస్థ నోవోస్టల్–ఎం (Novostal-M) భారతదేశంలో,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్బర్గ్లో సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకోతో సమావేశమైన మంత్రి, దేశంలో పెరుగుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ (EAF) స్టీల్ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు.
భారత్లో వేగవంతమైన పర్యావరణ అనుమతులు, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాల మార్కెట్, పెట్టుబడులకు అనుకూల విధానాలు ఉన్నాయని లోకేష్ వివరించారు. ఉన్నత శ్రేణి రీబార్లు, వైర్ రాడ్ల తయారీకి అనువైన ఆధునిక స్టీల్ ప్లాంట్ను స్థాపిస్తే భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
శ్రీసిటీలో రోలింగ్ మిల్లు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో తక్షణ రైల్వే సైడింగ్ కనెక్టివిటీతో స్ట్రక్చరల్ సెక్షన్, రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలో ఆటోమోటివ్, షిప్బిల్డింగ్ పరిశ్రమలకు అవసరమైన మెటీరియల్ను నేరుగా సరఫరా చేసే హార్డ్వేర్ గాల్వనైజ్డ్ వైర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా నోవోస్టల్–ఎం సరఫరా వ్యవస్థతో అనుసంధానంగా ప్రత్యేక వాటర్ఫ్రంట్ బెర్త్లతో కూడిన ముడి పదార్థాల లాజిస్టిక్స్ హబ్ అభివృద్ధికి సంయుక్త భాగస్వామ్యాన్ని పరిశీలించాలని కోరారు. సౌర, పవన విద్యుత్ వనరులతో అనుసంధానిస్తూ తక్కువ కార్బన్ ఉక్కు ఉత్పత్తిలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
60 దేశాలకు ఎగుమతులు
సమావేశంలో మాట్లాడిన నోవోస్టల్–ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో, తమ సంస్థ ఏటా 2.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తూ 60కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోందని తెలిపారు. స్టీల్ ఉత్పత్తి, హోల్సేల్ మెటల్ వ్యాపారంలో సంస్థకు విశేష అనుభవం ఉందన్నారు.
భారత్లోని నిర్మాణ, ఉత్పాదక రంగాలకు సెమీ-ఫినిష్డ్, లాంగ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ప్రీమియం స్టీల్ బిల్లెట్లు, స్ట్రక్చరల్ రీబార్లు, హైస్పీడ్ వైర్ రాడ్లు, ప్రత్యేక వెల్డింగ్ వైర్లను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. జాతీయ రైల్వే, హైవే ప్రాజెక్టులకు అవసరమైన లాంగ్ స్టీల్ ఉత్పత్తులను అందిస్తూ ముడి పదార్థాల కొరత నివారణలో భాగస్వామ్యం వహిస్తున్నామని తెలిపారు.
ముంబై, చెన్నై వంటి ప్రధాన నౌకాశ్రయాల ద్వారా దిగుమతులు, పంపిణీ వ్యవస్థను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్న డెమ్చెంకో, మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని వెల్లడించారు.