అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించాం:
హోంమంత్రి అనిత
అమరావతి,జూన్ 3: డీఎస్సీ-2025ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదిస్తూ కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించి వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిందన్నారు.
గత ప్రభుత్వం కేవలం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయగా, కూటమి ప్రభుత్వం 240కిపైగా కోర్టు కేసులను అధిగమించి కేవలం 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో నియామక ప్రక్రియ పూర్తి చేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనూ అనేక డీఎస్సీలను విజయవంతంగా నిర్వహించి లక్షలాది మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు.డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా టీసీఎస్ ద్వారా దాదాపు 43 వేల ప్రశ్నలను సిద్ధం చేసి పరీక్షలు నిర్వహించామని, మూడు దశల్లో గ్రీవెన్స్ పరిష్కార ప్రక్రియ చేపట్టి 34 వేలకుపైగా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేశామని తెలిపారు.
స్పోర్ట్స్ కోటా కింద 3 శాతం రిజర్వేషన్ ప్రకారం 421 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా, అర్హత సాధించిన 382 మందినే ఎంపిక చేశామని చెప్పారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను సంబంధిత ఫెడరేషన్లు, అసోసియేషన్ల ద్వారా ధ్రువీకరించి, నిబంధనల మేరకే ఎంపికలు చేపట్టినట్లు వెల్లడించారు.డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్న మంత్రి అనిత, యువత భవిష్యత్తుతో ముడిపడిన నియామక ప్రక్రియల్లో పారదర్శకత, న్యాయం, జవాబుదారీతనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో వివాదాలు చోటుచేసుకున్నాయని, చంద్రబాబు పాలనలో అలాంటి ఘటనలు లేవని ఆమె అన్నారు.