జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలతో గోదావరి పుష్కరాలు:
డిప్యూటీ సీఎం కళ్యాణ్
అమరావతి,జూన్ 6:గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, కాలుష్యరహితంగా నిర్వహించేందుకు పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను జీరో లిక్విడ్ డిశ్చార్జి మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.పంచాయతీల నుంచి వచ్చే మురుగు నీరు చుక్క కూడా గోదావరిలో కలవకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రెయిన్ల ద్వారా మురుగు నీటి సమస్యను పూర్తిగా నివారించాలని సూచించారు. పుష్కర ఘాట్లు, పుష్కర నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, డ్రెస్సింగ్ రూములు, స్నాన సౌకర్యాలు, రహదారులు, డ్రెయినేజీ వంటి మౌలిక వసతులు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.సీతానగరం సమీపంలోని మునికూడలి ఘాట్ను జాతీయ స్థాయి మోడల్ ఘాట్గా అభివృద్ధి చేయాలని, దానికి **“సప్తర్షి పుష్కర్ ఘాట్”**గా నామకరణం చేయాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశంలోనే తొలి జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీగా మునికూడలి నిలవాలని ఆకాంక్షించారు. ఘాట్ పరిసరాల్లోని సోమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ నెలలో కేబినెట్ సమావేశం అనంతరం మునికూడలి ఘాట్ను స్వయంగా సందర్శించి పనులను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకునేలా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.