జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
అమరావతి,జూన్5:జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఆయన పేరును ప్రకటించారు.
జనసేన పార్టీతో పాటు పవన్ కల్యాణ్తో 2015 నుంచి లింగమనేని రమేష్కు సన్నిహిత అనుబంధం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సమతుల్య సామాజిక న్యాయం అవసరమనే పవన్ కల్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులై ఆయన పార్టీకి అండగా నిలిచారని పేర్కొన్నాయి.శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.2019 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ జనసేన సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ నాయకత్వంపై విశ్వాసం ఉంచి పార్టీతో కొనసాగిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తున్నామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కుల, మతాలకు అతీతంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి ప్రోత్సహించే విధానంలో భాగంగానే లింగమనేని రమేష్ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపాయి.