తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత
చెన్నై,జూన్ 10:తమిళ సినీ పరిశ్రమలో గ్రామీణ కథలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీరాజా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ విశిష్ట దర్శకుడిని కోల్పోయింది.
1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా.. 1977లో విడుదలైన‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి సంచలనం సృష్టించారు. అప్పటివరకు స్టూడియోలకు పరిమితమైన తమిళ సినిమాను పల్లెల బాట పట్టించి,గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక శైలి కారణంగానే అభిమానులు ఆయననుదర్శక ఇమయం’గా గౌరవించారు.
‘సిగప్పు రోజక్కల్’, ‘కిజక్కే పోగుం రైల్’, ‘అలైగల్ ఓయ్వతిల్లై’, ‘ముదల్ మరియాదై’, ‘కరుత్తమ్మ’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలు రూపొందించి తన ప్రతిభను చాటుకున్నారు.
తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకోగా, ఆయనకు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును తెచ్చిపెట్టింది. అలాగే ‘మంగమ్మగారి మనవడు’ చిత్రానికి కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్ప్లేను అందించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
తన చిత్రాల ద్వారా రాధా, రాధికా, రేవతి, కార్తీక్ తదితర పలువురు నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా భారతీరాజాదే. దర్శకుడిగానే కాకుండా ‘ఆయుధ ఎళుత్తు’,‘పాండియా నాడు’‘తిరుచిత్రంబలం’ తదితర చిత్రాల్లో నటుడిగానూ తనదైన ముద్ర వేశారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించిన భారతీరాజా ఆరు జాతీయ పురస్కారాలు,నాలుగు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందుకున్నారు. భారతీయ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2004లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
గ్రామీణ జీవిత సౌందర్యాన్ని, మానవ సంబంధాల సున్నితత్వాన్ని తన చిత్రాల ద్వారా చిరస్థాయిగా నిలిపిన భారతీరాజా మరణం సినీ రంగానికి తీరని లోటుగా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఆయన ఒకరిగా గుర్తుండిపోతారు.