రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:
మంత్రి తుమ్మల
వరంగల్, జూన్ 2: రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ (ఎనుమాముల) వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్పర్సన్గా బండి జనార్ధన్ నియమితులయ్యారని మంత్రి తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, నిల్వ, విక్రయ ప్రక్రియల్లో పారదర్శకత పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి వెల్లడించారు. మార్కెట్ కమిటీల ఏర్పాటులో జాప్యం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ మార్కెట్లలో వరంగల్ (ఎనుమాముల) మార్కెట్ కమిటీ ఒకటని మంత్రి తెలిపారు. కొత్త పాలకవర్గం స్థానిక రైతుల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తూకం, నిల్వ, వేలం ప్రక్రియల్లో పారదర్శకత తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వ్యవసాయ ఉత్పత్తులకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్ యార్డుల్లో ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు ప్రయోజనాల పరిరక్షణ, వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ విధానమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూతనంగా నియమితులైన చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక, వైస్ చైర్పర్సన్ బండి జనార్ధన్తో పాటు పాలకవర్గ సభ్యులకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ, రైతులకు అంకితభావంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు. రైతు సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.