ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సమన్వయంతో పనిచేయాలి
టీడీపీ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ,ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో బూత్ ఏజెంట్లు, యూనిట్ ఇన్చార్జులు,క్లస్టర్ ఇన్చార్జులు,మండల అధ్యక్షులు,నియోజకవర్గ కమిటీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు సమిష్టిగా పనిచేయాలన్నారు.అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో నమోదు చేయడంతో పాటు, లోపాలను గుర్తించి సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కుల్లో ఓటు హక్కు ఒకటని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడాన్ని కర్తవ్యంగా భావించాలని, యువత ప్రత్యేకంగా ఓటరు నమోదుపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రతి యువకుడు, యువతి తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్న ఆయన, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహనతో వ్యవహరించాలని కోరారు. పార్టీ శ్రేణులు ప్రతి బూత్పై ప్రత్యేక దృష్టి సారించి ఓటరు నమోదులు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని సూచించారు.ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం కావాలంటే అన్ని స్థాయిల నాయకత్వం పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యేలు ,ఎంపీలు , పరిసలకు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.