గోదావరి పుష్కరాలు-2027కు భారీ ఏర్పాట్లు
సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యం – సీఎం చంద్రబాబు
1 / 2
అమరావతి, జూన్ 2: వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు-2027ను రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.మంగళవారం సచివాలయంలో గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై మంత్రుల కమిటీ, వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ ఆధ్యాత్మిక పర్యాటకానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పుష్కరాల కోసం చేపట్టే అభివృద్ధి పనులు తాత్కాలికంగా కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని స్పష్టం చేశారు.
పోలవరం పూర్తి చేసి జాతికి అంకితంగోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం వెల్లడించారు. దీంతో పుష్కరాలకు వచ్చే భక్తులు పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించే అవకాశం ఉంటుందని తెలిపారు. ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు రహదారిని ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర సాయం కోరాలి
పుష్కరాల సందర్భంగా రహదారి, రైల్వే రద్దీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. భక్తులకు సులభతరం చేసేందుకు అన్ని ఘాట్లకు నెంబరింగ్ వ్యవస్థ అమలు చేయాలని చెప్పారు. విశాఖపట్నం-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడిపే అంశంపై కేంద్ర రైల్వే శాఖతో చర్చించాలని, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని కోరాలని ఆదేశించారు.
టెంట్ సిటీలు, హోమ్ స్టేలుకుంభమేళా తరహాలో టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల క్షేత్రస్థాయిలో చేసిన పరిశీలనలో ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.
గోదావరి గట్టు సుందరీకరణ
పోలవరం ప్రాజెక్టు ఇరువైపులా రహదారులు నిర్మించడం, గోదావరి గట్టు సుందరీకరణ చేపట్టడం, రాజమహేంద్రవరం నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం వంటి అంశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులను పుష్కరాలకు ఆహ్వానించాలని సూచించారు.
అలాగే జూన్ 24 నాటికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించడంతో పాటు, ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఆర్టీజీ, టీటీడీ సంయుక్తంగా రద్దీ నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు.
6 జిల్లాల్లో 525 ఘాట్లు
పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మొత్తం 525 పుష్కర ఘాట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లకు అదనంగా 237 కొత్త ఘాట్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం 4.5 కిలోమీటర్ల మేర ఉన్న ఘాట్ల పొడవును 9.9 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించారు.
10 కోట్ల మంది భక్తుల రాక అంచనా
ఈసారి గోదావరి పుష్కరాలకు దాదాపు 9.95 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత పుష్కరాల్లో ఒక్కరోజులో 58.26 లక్షల మంది స్నానాలు చేయగా, ఈసారి ఒక్కరోజులోనే కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రూ.211 కోట్ల పనులకు ఇప్పటికే అనుమతి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే రూ.211.97 కోట్ల విలువైన 132 అభివృద్ధి పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, ఘాట్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల ఏర్పాట్లపై వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
గోదావరి పుష్కరాలు-2027ను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిలిపేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు.